
ఆది పినిశెట్టి కథానాయకుడిగా వసంతబాలన్ దర్శకత్వంలో తమిళంలో రూపొందుతోన్న ‘అరవన్’ చిత్రం ‘ఏకవీర’ పేరుతో తెలుగులో రానుంది. దామోదరప్రసాద్ ఈ అనువాద చిత్రానికి నిర్మాత. అర్జునుడు, నాగకన్య ఉలూచికి పుట్టిన ఐరావంతుడి కథను స్పూర్తిగా తీసుకొని… 18వ శతాబ్దంలో దక్షిణభారతదేశంలోని ఓ ప్రాంతంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపొందిస్తున్నట్టు దర్శకుడు తెలిపారు.
తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ‘ఏకవీర’ను విడుదల చేయనున్నట్టు ఆయన చెప్పారు. ‘‘చరిత్రాత్మక నేపథ్యంలో సాగే కథాంశంతో రూపొందుతోన్న ఈ చిత్రం ప్రేక్షకులను అబ్బుర పరుస్తుంది. 45 కోట్ల భారీ వ్యయంతో అద్భుత దృశ్యకావ్యంగా దీన్ని తీర్చిదిద్దుతున్నారు. సాంకేతిక పరంగా అత్యున్నత స్థాయిలో ఉంటుందీ సినిమా. కర్నూలు గండికోటలో 18 రోజులు చిత్రీకరణ పూర్తి చేసుకొని, ప్రస్తుతం బొబ్బిలికోట, హంపి, తలకోన పరిసర ప్రాంతాల్లో చివరి షెడ్యూల్ జరుపుకుంటోంది.